పాలనా సౌలభ్యం దృష్టిలో పెట్టుకొని చేసిన కొత్త జిల్లాల ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని, దశాబ్దాలనాటి కలలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయం కారణంగా సాకారమవడంతో అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి వియజసాయిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. రాష్ట్రంలో జిల్లా రహదారుల నిర్మాణం వేగవంతం కానుందని, ప్రభుత్వం రూ. 6, 400 కోట్లతో రెండు దశల్లో 2, 512 కి. మీ. మేర రోడ్ల నిర్మాణాన్ని చేపట్టిందని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విప్లవాత్మక మార్పులను రాష్ట్ర ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారని. గత రెండేళ్లలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 3. 46కోట్ల మందికి సేవలు అందించారని అన్నారు. గ్రామ స్వరాజ్యం కళ్ళ ముందు కనిపించేలా ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా టీనేజర్ల వ్యాక్సినేషన్ లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో నిలిచిందని అన్నారు.