ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ (గ్రూప్-IV సర్వీసెస్)లో జూనియర్ అసిస్టెంట్-కమ్-కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఈ దరఖాస్తుల స్వీకరణకు గడువు జనవరి 19న ముగియాల్సింది ఉండగా, జనవరి 29 వరకు పొడగించింది. అయితే తాజాగా ఈ గడువును మరోసారి పొడిగించారు. ఇప్పటి వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోని నిరుద్యోగుల అభ్యర్థన మేరకు తాజాగా దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 6 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన ఏపీపీఎస్సీ, తాజాగా మరోసారి గడువు పొడిగించింది. ఇదిలా ఉంటే నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 670 పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. 18 నుంచి 42 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు.