కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్లైన్లో టోకెన్ల జారీ ప్రక్రియను గతేడాది సెప్టెంబర్ 25 నుంచి రద్దు చేసారు. సర్వదర్శనం టోకెన్లను ఆన్లైన్లో జారీ చేస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య భక్తులకు దర్శన టోకెన్లు అందడం లేదని టీటీడీ అభిప్రాయపడింది.ఈ నేపథ్యంలో ఇక నుండి ఆఫ్ లైన్ విధానంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఎప్పటికప్పుడు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 15 నాటికి ఓమిక్రాన్ తీవ్రత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి 15 వరకు ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేస్తున్నామని, ఫిబ్రవరి 15న కరోనా పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లను ఆఫ్లైన్లో జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేస్తుంది.