విజయనగరం జిల్లాలోని మన్యంలో నాలుగేళ్లుగా సంచరిస్తోన్న ఏనుగుల గుంపుతో గిరిజనులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవులను వదిలి జనావాసాల్లోకి రావడంతో ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. వాటి దాడుల్లో పదుల సంఖ్యలో మరణించగా, వందల మంది గాయపడ్డారు. ఇటీవల ఓ ట్రాకర్ ని పొట్టన పెట్టుకోగా, కరిరాజుల తరలింపు సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది.
జిల్లాలో దాదాపు లక్ష హెక్టార్ల మేర అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. దీంతో పాటు విశాలమైన పరీవాహక ప్రాంతం కలిగిన నాగావళి నది మన్యం గుండా ప్రవహిస్తోంది. దీంతో 1998 నుంచి వచ్చి వెళుతున్న ఏనుగులు 2018లో ఎనిమిదింటితో కూడిన గుంపు ఒడిశా నుంచి ఇక్కడకు చేరింది. 2019, 2020 సంవత్సరాల్లో పలుమార్లు అటూఇటూ తిరిగాయి. చివరకు 2020 మార్చిలో తిరిగొచ్చి కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, పార్వతీపురం మండలాల్లో సంచరిస్తున్నాయి. ఇప్పటికే మూడు పెద్ద గజరాజులు మరణించగా, ఇటీవల ఓ పిల్ల ఏనుగు పుట్టింది. ప్రస్తుతం ఆరు ఏనుగులు తిరుగాడుతున్నాయి.