సంక్రాంతి పర్వదినానికి ముందు వచ్చే భోగి పండగ హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవటం ఒక సాంప్రదాయకంగా కొనసాగుతుంది. అయితే అక్కడక్కడా కొన్ని గ్రామాలలో భోగి పండుగను పూర్తిగా నిషేధించి ఆనాటి పెద్దలు నిర్ణయం తీసుకోవడంతో.. నేడు ఆ గ్రామాలలో భోగిమంటలు కానరాని పరిస్థితి నెలకొన్నాయి.
ఆనాటి పెద్దల మాటలను నేటికి కూడా వాటిని అమలు చేస్తూ భోగి పండగలను నిర్వహించుకోవడం నిలిపివేశారు. ఈ కోవలో నరసన్నపేట మండలం బాలసీమ పంచాయతీలోని బసివలస, ఉర్లాం పంచాయతీలోని చింతువాని పేట, వీ ఎన్ పురం పంచాయతీలోని గోకయ్యవలస, చోడవరంలో సుందరాపురం గ్రామాల ప్రజలు ఏటా భోగి పండుగను నిర్వహించుకోరు.
బసివలసలో ఎంతో కాలం కిందట జరిగిన చిన్నపాటి ఘర్షణ నేపథ్యంలో ఈ పండగపై నిషేధం విధించుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. గోకయ్యవలసలో గతంలో ఓసారి భోగి మంటల్లో ఓ పిల్లి పడి మరణించింది. ఆ నాటి నుంచి ఆ సంఘటనను అపశకునంగా భావించి గ్రామంలో భోగి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు అక్కడి వృద్ధులు తెలిపారు.
జలుమూరు మండలం లింగాలవలస గ్రామస్థులు కూడా భోగి మంటకు దూరంగా ఉంటున్నారు. పూర్వం జలుమూరు మండలం లోని ఉన్న కొండల్లో పులులు నివాసం ఉండేవి. ఈ క్రమంలో కొన్నేళ్ల కిందట భోగి మంట వేసిన వ్యక్తిని పులి చంపేసింది. దీంతో అప్పటి నుంచి భోగి మంట వేయరాదని పూర్వీకులు తీర్మానించారు. ఈ మేరకు పూర్వీకుల నిర్ణయానికి కట్టుబడి భోగి వేడుకలకు దూరంగా ఉంటున్నామని సర్పంచ్ దుంగ స్వామిబాబు తెలిపారు.
![]() |
![]() |