శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం జనవరి నెల టికెట్లను తితిదే ఆన్లైన్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేసింది.4.60 లక్షల టికెట్లను విడుదల చేయగా.. గంటలోనే భక్తులు అన్నింటినీ కొనుగోలు చేశారు. వర్చువల్ క్యూ పద్ధతిలో వెబ్సైట్లోకి ప్రవేశించి టికెట్లను బుక్ చేసుకున్నారు. ఒకనొక దశలో దర్శన టికెట్ల కోసం ఒక్కసారిగా వెబ్సైట్కు 14 లక్షల హిట్లు వచ్చాయి. మొదటి 22 నిమిషాల్లోనే 3.20 లక్షల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులపాటు టికెట్ల సంఖ్యను రోజుకు 20 వేలకు పెంచారు. సర్వదర్శనం టికెట్లను ఎలా విడుదల చేయాలనే విషయంపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు సమీక్షిస్తున్నట్లు సమాచారం. జనవరిలో రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. రోజు 5 వేలు ఆఫ్లైన్లో.. 5 వేలు ఆన్లైన్లో విడుదల చేయాలా లేక పూర్తిగా ఆఫ్లైన్లో విడుదల చేయాలా? అనే విషయమై సమీక్షిస్తున్నారు. ఒమిక్రాన్ పరిస్థితికి అనుగుణంగా సర్వదర్శనం టికెట్ల జారీని నిర్ణయించే అవకాశం ఉంది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా తీసుకురావాలని తితిదే కోరింది. 18 ఏళ్లలోపు వారు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తేవాలని సూచించింది. ఇప్పటికే ఈ విధానం అమలులో ఉన్నా.. కొందరు భక్తులు తీసుకురాకపోవడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నిఘా, భద్రతా సిబ్బంది తనిఖీచేసి వెనక్కి పంపుతున్నట్లు వెల్లడించింది.