విజయవాడలో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. పోలీసులే తన భర్తను కొట్టి చంపారని అతడి భార్య, కుటుంబ సభ్యులు ఆరోపించారు. విజయవాడకు చెందిన భానుచందర్... ట్రావెల్స్ వ్యాపారం చేసేవారు. ఆయన కారులో వస్తుండగా ఎ.కొండూరు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం తెలంగాణ మద్యంతో పోలీసులకు పట్టుబడ్డారు. భానుచందర్ ని అరెస్టు చేసిన పోలీసులు. రిమాండ్ కోసం నూజివీడు సబ్ జైలుకు తరలించారు. మంగళవారం భాను పరిస్థితి బాగాలేకపోవడంతో నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్నందున అక్కడి నుంచి GGHకు తీసుకెళ్లేలోపు మృతి చెందారు. పరీక్షించిన జీజీహెచ్ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భానుచందర్ కి మధుమేహం ఉందని, జైల్లో మాత్రలు ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు అయినట్లు వివరించారు. కుటుంబసభ్యులు మాత్రం పోలీసులే కొట్టారని ఆగ్రహం వెలిబుచ్చారు. చనిపోయిన భానుచందర్ వైకాపా మద్దతుదారు కావడంతో నగరానికి చెందిన పలువురు కార్పొరేటర్లు ఆసుపత్రికి వచ్చి పోస్టుమార్టం చేయడానికి వీల్లేదని అడ్డుకున్నారు. మృతదేహం స్వాధీనం చేసుకొనే విషయంలోనూ మృతుడి బంధువులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.