శ్రీకాకుళం : 48 గంటల్లో దొంగతనం కేసును రాజాం టౌన్ పోలీసులు ఛేదించారు. సిసి కెమెరాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం విలేకరులకు ఎస్పి అమిత్ బర్దార్ వెల్లడించారు. రాజాం పట్టణంలోని మద్యం దుకాణంలో ఈనెల 28న రాత్రి దుండగులు షాపు పైకప్పు సిమెంట్ రేకులు తొలగించి క్యాష్ బాక్సులో ఉన్న రూ.6,97,750 అపహరించుకుకపోయారు. ఆ మరుసటి రోజు దుకాణాన్ని తెరిచిన సూపర్వైజర్ ధర్మాన రాము క్యాష్ బాక్సులో డబ్బులు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇన్ఛార్జి డిఎస్పి జి.వెంకటేశ్వరరావు, సిసిఎస్ డిఎస్పి ఎస్.ఆదాం, రాజాం సిఐ పి.శ్రీనివాసరావు ఘటనా స్థలం సమీపంలోని సిసి కెమెరా ఫుటేజ్ను పరిశీలించి, అనుమానితుని సెల్ఫోన్ డేటా టవర్ లొకేషన్ బట్టి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చిన్న గుడబకు వాండ్రసి వెంకటరమణను, రేగిడి ఆమదాలవలస మండలం గుడబకు చెందిన కేంబురి చిన్న, సంతకవిటి మండలం బొద్దూరుకు చెందిన రేగిడి దామోదరరావును రాజాం మండలం డోలపేట జంక్షన్ వద్ద బుధవారం అరెస్టు చేసి విచారించారు. నిందితుల నుంచి దొంగలించిన రూ.6,97,750 నగదు, మోటార్ సైకిల్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్కు తరలించారు. 48 గంటల్లో కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన రాజాం పట్టణ, సిసిఎస్ పోలీసులను ఎస్పి అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పి టి.పి విఠలేశ్వరరావు, డిఎస్పిలు ఎం.శ్రావణి, జి.శ్రీనివాసరావు, జి.వెంకటేశ్వరరావు, ఎస్.ఆదాం, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.