అనంతపురం: కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు ఓ భర్త. ఈ ఘటన బుధవారం అనంతపురంలో చోటు చేసుకుంది. ఒకటో పట్టణ సీఐ ప్రతాప్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఉమానగర్ లో అనిల్ కుమార్, లావణ్య ఆలియాస్ పద్మజ (33) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పద్నాగేళ్ల కిందట వివాహమైంది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనిల్ గతంలో వస్త్ర వ్యాపారం చేసేవాడు. ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు.
భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడ్డలితో భార్య తలపై నరకడంతో అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు నేరుగా ఒకటో పట్టణ పోలీస్ స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలి తండ్రి బండి రాముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి హత్యకు గురికావడం, తండ్రి హంతకుడిగా మారడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు.