పెళ్లైన 13 రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని బళ్లారి బైపాస్ ఆంజనేయ నగర్కు చెందిన శ్రీసాయి సుజన (26) కు నవంబర్ 17న చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన విశ్వనాథ్తో వివాహమైంది. ఆమె కొన్ని రోజుల పాటు అత్తింటిలో ఉండి పుట్టింటికి వచ్చారు. ఈ క్రమంలోనే నవంబర్ 29న సాయంత్రం అత్తింటికి సాగనంపేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో తల్లిదండ్రులను వదిలి వెళ్లలేని మానసిక స్థితిలో సుజన బాత్రూంకెళ్లి బయటకు రాలేదు. ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్ధలు గొట్టి లోపలికెళ్లి చూశారు. సుజన షవర్ కు చున్నీతో ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.