రైతుల పడుతున్న సాగు నీటి కష్టాలను శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో గాలేరు-నగరి ప్రాజెక్ట్ కు అంకురార్పణ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు నీటి కాలువలను ఏర్పాటు చేసి చెరువులను, కాలువలను, కుంటలను అనుసంధానం చేస్తూ రైతుల పంటల సాగుకు ఉపయోగపడే విధంగా సాగు నీటిని అందించాలనే సంకల్పంతో 30 ఏళ్ల క్రితం నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గాలేరు-నగరి ప్రాజెక్టుకు నాంది పలికారు. అయితే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన అనంతరం తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడంతో ఆ ప్రాజెక్టు కాస్త శంకుస్థాపనకే పరిమితమైంది. అనంతరం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవ్వరూ ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు.
ఈ క్రమంలో 2004 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి రాయలసీమ ప్రాంతాన్ని సాగు నీటితో సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో గాలేరు-నగరి పథకాన్ని కాస్త హంద్రీ-నీవాగా నామకరణం చేసి టెండర్లు పిలిచి పెద్ద ఎత్తున కాలువలను తవ్వించారు. ఈ కాలువలను ఏర్పాటు చేయడంలో భాగంగా చిన్నమండెం మండల కేంద్రం నుండి దేవపట్లకు వెళ్లే రోడ్డు మార్గం తవ్వేసి కాలువను ఏర్పాటు చేశారు.
రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన ఆ కాలువపై అధికారులు బ్రిడ్జి ఏర్పాటు చేయడం మరిచారు. ఈ క్రమంలోనే హంద్రీ-నీవా ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టే సమయంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అకాల మరణంతో ఈ ప్రాజెక్ట్ కాస్త మూలన పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా కాలువ పైన బ్రిడ్జి నిర్మాణం మాత్రం జరగలేదు. అంతేగాక చిన్న మండలం నుండి దేవపట్లకు వెళ్లే ఈ రహదారి ఇటు రాయ చోటి-బెంగళూరు అటు రాయచోటి-చిత్తూరు రహ దారులను కలిపే మార్గం కావడం, ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కాలువ గట్టు మీదుగా 2 కిలో మీటర్ల దూరం మట్టి రోడ్డు ఏర్పాటు చేసి అక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ మట్టి రోడ్డు కాస్త బురదమయం, గుంతలమయం కావడంతో పాటు వాహనాలు రాకపోకలు ఎక్కువై రోడ్డుపై ఉన్న మట్టి మొత్తం కాలువలోకి కొట్టుకొని పోయింది. ఫలితంగా మట్టి రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి వర్షపు నీరు వచ్చి గుంతల్లో చేరడం వలన వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు సైతం తమ పొలాల్లో పండించిన పంటను ఇంటికి తీసుకెళ్లాలంటే నానా అగచాట్లు పడుతున్నారు. కాలువ పై బ్రిడ్జి లేక పడుతున్న ఇబ్బందులను ఆ ప్రాంత ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికి అక్కడ ఎటువంటి శాశ్వత చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి వెంటనే హంద్రీ-నీవా కాలువపై బ్రిడ్జి ఏర్పాటుచేసి శాశ్వత పరిష్కారం చూపాలని అవసరం ఎంతైనా ఉందని ఆ ప్రాంత ప్రజలు రైతులు కోరుతున్నారు