ఆంధ్రప్రదేశ్ లో వరద పరిస్థితులను తెలుసుకోవడానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం చిత్తూరు జిల్లాలో తిరుపతి దగ్గర లో ఉన్న రాయల చెరువును పరిశీలించింది. కేంద్ర బృందానికి రాయల చెరువు పరిస్థితిని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, వైస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివరించారు. పర్యటనలో కేంద్ర బృందం చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం మామడుగు గ్రామంలో జరిగిన పంటనష్టాన్ని పరిశీలించింది. ఇక్కడ కనికల్ల చెరువు ఆయకట్టు కింద 172 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ సందర్భంగా తమ గ్రామానికి వచ్చిన కేంద్ర బృందం సభ్యులకు గ్రామస్తులు తమకు జరిగిన నష్టాన్ని తెలిపారు . తమను ఆదుకోవాలని కోరుకున్నారు.