కరవు తప్ప కనీస వర్షపాతం ఎరుగుని జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎప్పుడూ ఎండిపోయి దర్శనమిచ్చే నదులు...ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ధాటికి వరదనీటితో పోటెత్తాయి. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యంలో ఏనాడు యాభై శాతం నీరు కూడా చేరని ప్రాజెక్ట్లు పొంగిపొర్లి ఆనకట్టలే ఆనవాళ్లు లేకుండా పోయాయి. కనీస ప్రవాహం ఎరుగని పెన్నా, బహుదా, పింఛా, పాపాఘ్ని, స్వర్ణముఖి నదులకు తోడు స్థానిక వాగులు పొంగిపొర్లి జనావాసాలను ముంచెత్తాయి. ముంచెత్తిన వరదనీటి కింద గ్రామాలు మట్టిదిబ్బలవగా....వేల ఎకరాల పచ్చటి మాగాణులు ఇసుకమేటలతో ఎడారిని తలపిస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలను వరద కోలుకోలేని దెబ్బతీసింది. వరద ప్రభావం కడప జిల్లాపై అధికంగా ఉండగా..చిత్తూరు, నెల్లూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయాయి.