ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రం అప్పుల ఊబిలోకి రావడానికి ప్రధాన కారణం బీజేపీనే : సుంకర పద్మశ్రీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 27, 2021, 05:47 PM

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదాపై బీజేపీ స్టాండ్ చెప్పి బద్వేలులో ఓట్లు అడగాలని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆమె కోరారు. విజయవాడలో బుధవారం పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. బద్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ నేతలను చూస్తే జాలి కలుగుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి బీజేపీ ఏం సాయం చేసిందో చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని రాష్ట్ర ప్రజల ఆశలను చిదిమేశారని విమర్శించారు.ప్రస్తుతం బీజేపీ నాయకులు భయాందోళనలో కూరుకుపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి రావడానికి ప్రధాన కారణం బీజేపీనే అని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి బడా నాయకులను పిలిపించి అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎక్కడని మీ ప్రధానిని ప్రశ్నించి రాష్ట్రానికి న్యాయం చేయాలని దగ్గుబాటి పురంధేశ్వరికి పద్మశ్రీ సవాల్ విసిరారు. రైతుల పాలిట శాపమైన నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టారని సుంకర పద్మశ్రీ విమర్శించారు. బీజేపీ, వైసీపీ చేస్తున్న అరాచకాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ తానా అంటే వైసీపీ తందనా అంటుందని, ఇద్దరిది మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com