ఆ యువతి, యువకుడు మేజర్లు. ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులు సదరు యువకుడితో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో స్నేహితుల సహకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆ యువతిని బలవంతంగా ఆమె కుటుంబం పుట్టింటికి తీసుకెళ్లింది. తమ కూతురిని కలవాలని చూస్తే చంపేస్తామని ఆ యువకుడిని యువతి కుటుంబం బెదిరించింది. అంతేకాకుండా తన భార్యకు ప్రాణ హాని కూడా ఉందని ఆ యువకుడు ఫిర్యాదు చేశాడు. తమిళనాడులోని ఈరోడ్కు చెందిన సెల్వన్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో ఇళమతి అనే యువతి కూడా పనిచేస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరు. దీంతో రెండు కుటుంబాలు వీరి ప్రేమ బంధాన్ని వ్యతిరేకించాయి. దీంతో పెరియార్ స్టూడియోలో ద్రవిడార్ లిబరేషన్ ఫ్రంట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అయిన ఈశ్వరన్ సహకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొన్ని నెలలు సంతోషంగా జీవించారు. అయితే వీళ్లు ఎక్కడ కాపురం పెట్టింది తెలుసుకున్న యువతి కుటుంబం ఆ యువకుడిని కొట్టి ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనతో తీవ్ర మనోవేదన చెందిన సెల్వన్ తన భార్యను ఇలా తీసుకెళ్లిపోయారని, తామిద్దరం మేజర్లమని, ప్రేమ పెళ్లి చేసుకున్నామని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఈ విషయంలో స్పందించలేదని సెల్వన్ తెలిపాడు. అప్పటి అన్నాడీఎంకే మంత్రికి, ఆ యువతి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని బాధిత యువకుడు పేర్కొన్నాడు. తన భార్య నుంచి ఇటీవల సెల్వన్కు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. తనను చంపాలని చూస్తున్నారని, తన లైఫ్ డేంజర్లో ఉందని, వచ్చి కాపాడాలని ఆ యువతి సెల్వన్కు వాట్సాప్లో మెసేజ్ చేసింది. దీంతో.. ఆ యువకుడు ఈసారి మీడియా ముందుకు వచ్చి మరీ జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో.. పోలీసులు కూడా ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. తన భార్యకు ప్రాణ హాని ఉందన్న ఆ యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.