ఏపీలో రాజకీయాలు గంట గంటకు వేడెక్కుతున్నాయి. ఉదయం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. బోషడీకే అనే పదానికి సీఎం తనకు కావాల్సిన అర్ధం వెతుక్కుంటున్నారన్నారు. బోష్ డీకే అని గుజరాత్ లోని ఓ గ్రామం ఉందని, ఆ పదానికి అమాయకులు అనే అర్ధం కూడా ఉందని ఆయన అన్నారు. ఏపీలో గంజాయి సాగు, సరఫరా జరుగుతోందంటూ పక్క రాష్ట్రం డీజీపీనే అంటున్నారని తెలిపారు. పక్క రాష్ట్రం సీఎం గంజాయి విషయంలో తీసుకుంటున్న చర్యలు ఏపీ సీఎం తీసుకుంటే మేమూ హర్షిస్తామని, టీడీపీ కార్యాలయంపై దాడిలో సుమారు పది మంది పోలీసులు దాడికి పాల్పడ్డారని అనుమానం ఉందని ఆయన ఆరోపించారు.
డీజీపీ కార్యాలయంలో పీఆర్వోను స్పాటర్ అని చెబితే మేం నమ్మాలా..? అని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని నిగ్గు తేల్చేందుకు సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి నుంచి విజయవాడ కన్వెన్షన్ సెంటర్ వరకూ ఉన్న సెల్ ఫోన్ టవర్ డేటా డంప్ ను విశ్లేషించాలని, పార్టీ కార్యాలయం మీద దాడి ఘటనపై కోర్టుకూ వెళ్తామని వెల్లడించారు. అంతేకాకుండా తప్పుడు కేసులు పెడితే మేం భయపడమని, బాస్ ఆఫ్ ద పోలీస్ నుంచే తప్పులు జరుగుతున్నాయని పోలీసులే బాధపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీసులు అంతర్మధనం చెందుతున్నారు. తమ బాస్ ఇచ్చే తప్పుడు ఆదేశాలు అమలు చేయలేక పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
తాడేపల్లి రేప్ ఘటనలో నిందితులు గంజాయి వినియోగదారులేనని ఆయన అన్నారు. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని, సీఎం వేదిక మీద మాట్లాడిన పదాలే మంత్రులు గతంలో రైతులను ఉద్జేశించి వాడారు.. అప్పుడు సీఎంకు నొప్పి అనిపించలేదా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల తల్లులు.. తల్లులు కాదా..? మా పోరాటం డ్రగ్స్ మీద.. చేతనైతే మీరూ మా పోరాటంలో పాల్గొనండి. భారత ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ వల్ల కూడా సాధ్యం కాని పనిని వైసీపీ చేయగలదా..? అని సవాల్ విసిరారు.