కరోనా వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డ్ సృష్టించింది. టీకాల పంపిణీలో సరికొత్త మైలురాయిని అందుకుంది. ఇవాళ్టి ఉదయ నాటికి మనదేశంలో 100 కోట్ల డోస్ల టీకాలు వేశారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ విజన్తోనే ఈ విజయం సాధ్యమయిందని మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 100 కోట్ల వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఒక వేడుకలా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. 100 కోట్ల వ్యాక్సినేషన్పై షార్ట్ ఫిలింతో పాటు స్పెషల్ సాంగ్ను రూపొందించారు. ఇవాళ ఎర్రకోటలో వీటిని విడుదల చేయనున్నారు. 100 కోట్ల వ్యాక్సినేషన్ను ఘనంగా జరుపుకునేందుకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 100 వారసత్వ కట్టడాలపై భారత జాతీయ పతాకంలోని మూడు రంగులతో లైటింగ్ ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల సేవల కొనియాడుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.