ఏపీలో తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు. ప్రతిపక్షం ఎలా తయారైందో ప్రజలు చూస్తున్నారన్నారు. బూతులు తిడుతూ ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారని, ఎవరూ మాట్లాడని బూతులను ప్రతిపక్షం మాట్లాడుతోందన్నారు. గతంలో తాము కూడా ప్రతిపక్షంలో ఉన్నామని, ఇలాంటి బూతులు ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా రెచ్చిపోయి బూతులు తిడుతున్నారని.. తమపై ఆప్యాయత చూపే అభిమానులు వాళ్ల బూతులు వినలేక బీపీ వచ్చి రియాక్ట్ అవుతున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల ప్రేమను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, ఓ వర్గం మీడియా కూడా జీర్ణించుకోలేకపోతోందన్నారు. కావాలని తిట్టించి రెచ్చగొడుతున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. వ్యవస్థలను కూడా మ్యానేజ్ చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులను చూసి ఓర్వలేకపోతున్నారు. అభివృద్ధి పనులను కోర్టు కేసులతో అడ్డుకుంటున్నారన్నారు. తనను, తన తల్లిని నోటికొచ్చినట్లు దుర్బాషాలాడటం వల్ల తమ అభిమానులకు బీపీ వస్తోందని, వారి కోపానికి గురి కావద్దని హెచ్చరించారు.