అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఆదివారం భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో మోడీకి బీజేపీ నేతలు గ్రాండ్ వెల్ కమ్ పలికారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డాతోపాటు పలువురు నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమెరికాలో 65 గంటల్లో 24 సమావేశాల్లో మోడీ పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోడీ వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంతోపాటు క్వాడ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో విడివిడిగా సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘానిస్తాన్ పరిణామాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదమయ్యాయని, రాబోయే రోజుల్లో భారత్-అమెరికా బంధాలు మరింత బలోపేతం అవుతాయని మోడీ తెలిపారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మోడీ ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని ఐరాస అనుకుంటే తన విశ్వసనీయత, సమర్థతను మరింత మెరుగుపర్చుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధపాలన సాగాలంటే ఐరాసను నిరంతరం బలోపేతం చేయాలని తెలిపారు. ప్రపంచ ప్రయోజనాలు, విలువలను పరిరక్షించేలా ఐరాస తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అమెరికా వెళ్లే సమయంలో ఈ నెల 22న విమానంలో ప్రధాని మోడీ రెండు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వాషింగ్టన్లో దిగిన వెంటనే మరో మూడు భేటీలు జరిగాయి. ఈ నెల 23న అమెరికాలోని ఐదు కంపెనీల సీఈవోలతో వేర్వేరుగా భేటీ కావడంతోపాటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగాతోనూ సమావేశమయ్యారు. ఆ తర్వాత తన అంతర్గత టీమ్తో మోడీ మరో మూడు సమావేశాలు నిర్వహించారు.