ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరిలో ఎమ్మెల్యే రోజాకు బిగ్ షాక్.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 26, 2021, 01:51 PM

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత ఒకటి ఉంది. రాజకీయాల్లో ఈ సామెతను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా విషయంలో ఈ సామెత గుర్తుకువస్తోంది. ఎమ్మెల్యే రోజా తొలుత ఇంట గెలిచారు. రచ్చ గెలిచారు. అయితే రాను రాను పార్టీలో అసమ్మతి నేపథ్యంలో రోజా ఇంట గెలవలేకపోతున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తిప్పలు తప్పడం లేదు.


సొంత నియోజకవర్గంలో అసమ్మతి సెగ పెరిగిపోయింది. దీంతో నియోజకవర్గంలో రోజా ఒంటరి పోరు చేస్తున్నారు. అయినప్పటికీ పోటీ చేసిన అన్ని ప్రాంతాల్లో రోజా వర్గీయులే విజయపతాకం ఎగురవేస్తున్నారు. పంచాయతీ, కార్పొరేషన్, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ తరపున రోజా నిలబెట్టిన అభ్యర్థులను బరిలోకి దించి గెలిపించుకోగలిగారు. అయితే ఈ ఎన్నికల్లో రోజా వర్గాన్ని దెబ్బకొట్టేందుకు అదే పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గం రెబెల్స్‌ను బరిలోకి దించింది. అయినప్పటికీ రోజా మద్దతు దారులే గెలిచారు. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా తన హవా చాటారు. తానేంటో నిరూపించుకున్నారు. ప్రత్యర్థి వర్గానికి చెక్ పెట్టగలిగారు.


పరిషత్ ఎన్నికల్లోనూ నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ ఎంపీపీ అభ్యర్థులను రోజా ఎంపిక చేశారు. అయితే నిండ్ర మండలంలో రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైన చక్రపాణి రెడ్డి రోజాకు ఎదురుతిరుగుతున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇద్దరి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంపీపీ ఎన్నికల్లో వర్గవిబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి.


నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం ఎంపీపీ ఎన్నిక ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నిండ్ర ఎంపీపీ స్థానానికి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. దీపా అనే అభ్యర్థిని బరిలోకి దించారు. అయితే అదే పార్టీలో ప్రస్తుతం శ్రీశైలం బోర్డు చైర్మన్‌గా ఉన్న చక్రపాణిరెడ్డి తన తమ్ముడు భాస్కర్ రెడ్డిని ఎంపీపీగా చేయాలని ఐదుగురు ఎంపీటీసీలతో క్యాంపు రాజకీయం చేశారు. దీంతో సెప్టెంబర్ 24న జరగాల్సిన ఎన్నికలకు ఐదుగురు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే రోజా స్వయంగా రంగంలోకి దిగి కోఆప్షన్ మెంబర్‌గా అనిల్ కుమార్‌ను ఎంపిక చేసుకున్నారు. ఎంపీటీసీలు అందరూ రాకపోవడంతో ఎంపీపీ ఎన్నికలను వాయిదా వేయించారు.


శనివారం నిండ్ర వైసీపీ ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. రోజా వర్గీయులు.. చక్రపాణిరెడ్డి వర్గీయుల మధ్య ఎన్నికల అధికారులు నలిగిపోయారు. తాను సూచించిన అభ్యర్థినే ఎంపీపీగా ప్రకటించాలని రోజా డిమాండ్ చేస్తే చక్రపాణిరెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల హాల్‌లోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో రోజా సహనం కోల్పోయారు. నువ్వు మగాడివైతే రాజీనామా చేసి ఇండిపెండెంగ్‌గా గెలవాలని ప్రత్యర్థి వర్గానికి సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు కంటతడి పెట్టుకునేవరకు వెళ్లిదంటే వర్గపోరు ఎంతటి స్థాయికి చేరిందో తెలుసుకోవచ్చు. అయితే రాష్ట్రరాజకీయాలను శాసిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన ఎదురుకావడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో, ఆదివారం రాత్రి నిండ్ర ఎంపీపీ ఎన్నికపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యం చేసుకుని సోమవారం సమస్య పరిష్కారానికి దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com