జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పోటీ చేసే వేళ పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాస్ ఇకపై ఆ పార్టీ అభ్యర్థులకు కేటాయించే అవకాశం లేదు. రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల హోదాలో కేవలం మూడు పార్టీలకే రిజర్వుడ్ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్సీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు, టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తులు రిజర్వుడ్ గుర్తులుగా ఉంటాయని పేర్కొంది. జాతీయ పార్టీ హోదాలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలకు రిజర్వుడ్ గుర్తులుంటాయంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎంలతో పాటు వైఎస్సార్సీపీ, టీడీపీలకూ ఆయా రిజర్వుడ్ గుర్తులు కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ కేటగిరిలో పేర్కొంది. అంటే.. సంబంధింత గుర్తును రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారెవరికైనా కేటాయించే వీలుంటుంది. ఇటీవల తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది. గత ఏడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం పది శాతం సీట్లకు పోటీ చేయని కారణంగా ఈ పార్టీలకు కామన్ గుర్తుల్ని తొలగించినట్లుగా ఎన్నికల సంఘం చెబుతోంది.