వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అనేక రైతు సంఘాలు కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాయని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేయవద్దని చేస్తున్న భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దత్తు ఇస్తుందని తెలిపారు. ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు తిరగవని తెలిపారు. రైతాంగానికి, విశాఖ ఉక్కుకు సంబంధించి పోరాటం చేస్తున్న వారంతా శాంతియుతంగా బంద్ నిర్వహించాలని అన్నారు. 27వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బస్సులు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.