కోట గలిగిన కొండ.. కొండ కలిగిన కోట... కోట కొండల్లో మేటి మా పెనుకొండ కొండ అనే నానుడికి అద్దం పడుతూ పెనుకొండ చారిత్రాత్మక శిల్పకళా కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. విజయనగర రాజుల రెండవ రాజధానిగా పేరొందిన శ్రీకృష్ణదేవరాయల వేసవి విడిది పెనుకొండ.
పర్యాటక ప్రాంతంగా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో రాయలవారి వేసవి విడిదిగా పేరొందిన గగన్ మహల్ మొదలుకొని గాలి గోపురం, తిమ్మరసు బందీఖానా, బసవన్న బావి బసవ కర్రి బావి ఈ బావులు దేవాలయం జైన దేవాలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన పెనుకొండ బాబయ్య స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, ఆంజనేయస్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, శ్రీ కాళికా మాత ఆలయాలు ఉన్నాయి.
వీటితో పాటు పెనుకొండ ప్రాంతంలో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న 365 దేవాలయాలు ఉన్నాయి. అందుకే పెనుగొండ టెంపుల్ టౌన్ గా ప్రసిద్ధి చెందింది. అంతేకాక కొండపైన వెలసిన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కోనేరు తదితర అనేక ప్రాంతాలు ఉన్నాయి. అప్పటి రాయల ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో 2010లో వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన రాయల విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇటీవల టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పెనుకొండ కోట ముఖద్వారం ఎంతగానో ఆకర్షిస్తోంది. రాయల కాలం నాటి అనేక కట్టడాలు శిల్పకళా సౌందర్యం ఎంతో అద్భుతాన్ని ఇస్తోంది. అంతేకాక కోటగోడలు, పురాతన బావులు, నాట్య మండపం, రాయల కాలం నాటి నీటి తొట్టె, తిమ్మరసు సమాధి, బురుజులు, రాతి కట్టడాలు, శిల్పకళ నాటి రాయల వైభవానికి అద్దం పడుతోంది.