ఓ భర్త కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. పెళ్లైన 10 నెలలకే ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి (19) ప్రస్తుతం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఎనస్తీషియా ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం యాళ్లగూడేనికి చెందిన గంగరాజుతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో 10 నెలల కిందట వారు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సుధారాణి హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది.
అయితే ఈనెల 17న తన గంగరాజు కాకినాడకు వచ్చాడు. సుధారాణి, గంగరాజు ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో గంగరాజు క్షణికావేశంలో పదునైన ఆయుధంతో తన భార్య సుధారాణిని పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి సోమవారం ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో కాకినాడ పోలీసులు సోమవారం సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.