హృదయ విదారక ఘటన ఒకటి దక్షిణ అమెరికాలో చోటుచేసుకుంది. తన పిల్లలతో సముద్రంలో చిక్కుకున్న తల్లి వారిని బతికించాలని బలంగా భావించింది. పిల్లలకు పాలు ఇచ్చే శక్తి కోసం తన మూత్రాన్ని తానే తాగింది. అలా మూత్రం తాగి పిల్లలకు పాలిచ్చింది. పిల్లలను అయితే కాపాడుకోగలిగింది కానీ డీహైడ్రేషన్ కారణంగా పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. 40 ఏళ్ల మేరీలీ చాకోన్ తన కుటుంబంతో ఓడలో ప్రయాణిస్తోంది. మేరీలీ చాకోన్తో పాటు ఆమె భర్త, 6 ఏళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె, వారి ఇంటి పనులు చూసుకుంటున్న మరో మహిళ వెరోనికా మార్టినెజ్ ఉన్నారు. ఈ నౌక సెప్టెంబర్ 3 న వెనిజులా నుంచి టోర్టుగాకు బయలు దేరింది. కానీ కరేబియన్లో ఘోర ప్రమాదం జరిగింది. అలలు బలంగా తాకడంతో ఆ ఓడ రెండు ముక్కలుగా విరిపోయింది. ఆ ఓడ కొంత భాగం నీటిలో మునిగిపోయింది. ఓడలోని కొద్ది భాగం మాత్రం సముద్రంలో తెలియాడింది. అయితే మేరీలీ చాకోన్ భర్త నీటిలో మునిగిపోయాడు. మేరీలీ చాకోన్, ఆమె పిల్లలు, వెరోనికా మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరు ఓడ శిథిలాలపై ఉన్నారు. అయితే ప్రాణాలు అయితే దక్కాయి కానీ అది జనసంచారం లేని ప్రాంతం కావడంతో ఈ విషయం బయట ప్రపంచానికి వెంటనే తెలియలేదు. అప్పటికే రోజులు గడవడం.. ఆహారం, నీరు లేకపోవడంతో వారి శరీరాలు డీహైడ్రేషన్ చెందడం ప్రారంభమైంది. ఎండ తీవ్రత కూడా వారిని ఇబ్బందికి గురిచేసింది.
ఇక, పిల్లల సంగతి చూసి తల్లి మేరీలీ చలించిపోయింది. వారికి బతికించడానికి ఏదో ఒక రకంగా ఆహారం ఇవ్వాలని చూసింది. అయితే ఆమె పరిస్థితి కూడా ఏ మాత్రం బాగోలేదు. కానీ ఆమె తన పిల్లలకు పాలు ఇవ్వడం కోసం తన మూత్రాన్ని తానే తాగింది. అనంతరం పాలు ఇచ్చి వారి కడుపు నింపింది. అయితే శరీరం పూర్తిగా డీహైడ్రేషన్ కావడంతో ఆమె మరణించింది. ఓర్చిలా ద్వీపంలో ఓడ భాగాలు తేలుతున్నట్టుగా వెనిజులా అధికారులు సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం గుర్తించారు. మరుటి రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే మేరీలీ చనిపోయింది. అధికారులు అక్కడికి వెళ్లేసరికి తల్లి మృతదేహం పక్కన ఇద్దరు పిల్లలు కనిపించారు. ఆ పిల్లలను అధికారులు రక్షించారు.