ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా నేడు,రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ నుండి 5.8 కి.మీల ఎత్తుల మధ్య కొనసాగుతూ, ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి దిశవైపు వంగి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది రాగల 12 గంటలలో ఒడిస్సా తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ నుండి 5.8 కి.మీ ఎత్తుల మధ్య ఏర్పడింది.
రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రాలో కూడా రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాయలసీమలో కూడా రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.