ఏపీ ప్రభుత్వం- సినిమా పెద్దల మధ్య సమావేశానికి రంగం సిద్ధమైంది. గత కొన్నాళ్ల నుంచి ఏపీ ప్రభుత్వానికి - టాలీవుడ్ మధ్య విబేధాలు పెరుగుతూనే ఉన్నాయి. వకీల్ సాబ్ సినిమా విడుదల తరువాత గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఆ గ్యాప్ భర్తీ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సినిమా పెద్దల మధ్య సోమవారం భేటీ జరగనుంది. అయితే ఈ భేటీకి సీనియర్ల హాజరుపై అనుమానాలు పెరుగుతున్నాయి. సీఎం జగన్ తో భేటీ అయ్యేది ఎవరు అన్నదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ముఖ్యంగా ఈ భేటీ తరచూ వాయిదా పడుతుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఆగస్టు నెలాఖరులోనే ఈ భేటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ తరువాత ఈ నెల మొదటి వారంలో మీటింగ్ కచ్చితంగా జరుగుతుందని భావించారు. అయితే ఇప్పుడు సోమవారం ఈ భేటీకి రంగం సిద్ధం చేశారు. సీఎం జగన్తో టాలీవుడ్ పెద్దల భేటీలో ఎవరు పాల్గొంటారు అన్నదానిపై క్లారిటీ లేదు. మొదటి నుంచి సినిమా రంగం నుంచి పెద్దగా భావించే చిరంజీవి, నాగార్జున లాంటి వారు సమావేశానికి హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం కేవలం సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లను మాత్రమే వైసీపీ సర్కారు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. దీనిపై రేపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.