బిహార్ రాష్ట్రంలో వరుసగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో కోట్లు వచ్చిపడుతున్నాయి. 2 రోజుల క్రితం కటిహార్ జిల్లా బగౌరా పంచాయతీకి చెందిన ఇద్దరు విద్యార్థుల అకౌంట్లలో ఏకంగా రూ.960 కోట్లు జమ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకుముందు బిహార్ కే చెందిన ఓ వ్యక్తి ఖాతాలో రూ.5.5 లక్షలు జమ అవ్వగా.. ప్రధాని మోదీ ఇచ్చారంటూ ఆ డబ్బును వెనక్కి ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆ వార్త వైరల్ అయ్యింది.
ఇక తాజాగా బిహార్ లోని ముజఫరాపూర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడి పింఛన్ ఖాతాలో రూ.52 కోట్లు జమ అయ్యాయి. కతిహార్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రామ్ బహుదూర్ షా అనే రైతు తన పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లగా అతని ఖాతాలో రూ.52 కోట్లు ఉన్నాయన్న విషయం తెలిసి షాకయ్యాడు. తన అకౌంట్లో అన్ని డబ్బులు ఎలా వచ్చాయో తనకు తెలియదన్నాడు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే తమకు ఆ డబ్బుల్లోంచి కొంతమొత్తమైన ఇవ్వాలని, అలా ఇస్తే తమ జీవితం సాఫీగా సాగిపోతుందని ఆ రైతు మీడియాతో చెప్పాడు. ఈ అంశంపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు స్థానిక ఎస్సై తెలిపాడు. ప్రస్తుతం రామ్ బహుదూర్ ఖాతాను ఫ్రీజ్ చేశామని, అతని ఖాతాల్లోకి అంత మొత్తం ఎలా వచ్చిందో పరిశీలన చేస్తున్నామని బ్యాంకు అధికారులు చెప్పారు.