తమ గ్రామంలో రోడ్లు బాగోలేక స్థానికులకు వివాహాలు జరుగడం లేదంటూ ఒక యువతి సీఎం కార్యాలయానికి లేఖ రాసింది. ఇది అధికారుల్లో కదలిక తెచ్చింది. కర్ణాటకలోని దవంగెరె జిల్లాలోని హెచ్ రాంపురా గ్రామంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. దీంతో గ్రామానికి చెందిన 26 ఏండ్ల ఉపాధ్యాయురాలు బిందు దీనిపై ఆ రాష్ట్ర సీఎం కార్యాలయానికి ఒక లేఖ రాశారు. 'మా గ్రామానికి సరైన రోడ్ కనెక్టివిటీ లేదు. ఈ గ్రామం ఇంకా వెనుకబడి ఉంది. దీని వల్ల మాలో చాలా మందికి వివాహాలు కావడం లేదు. ఎందుకంటే, గ్రామంలో సరైన రోడ్లు లేకపోవడం వల్ల పిల్లలు ఇక్కడ విద్యను పొందలేరని బయటి వ్యక్తులు భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో రోడ్డు పనులు చేపట్టండి' అని అందులో పేర్కొన్నారు.
కాగా, బిందు లేఖపై కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పందించింది. ఈ సమస్యను తొందరలో పరిష్కరిస్తామని ఒక అధికారి భరోసా ఇచ్చారు. తక్షణమే పనులు చేపట్టాలని, జరుగుతున్న పనుల గురించి తెలియజేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను సీఎం కార్యాలయం ఆదేశించింది.
మరోవైపు ఈ గ్రామంలోని రోడ్డు అభివృద్ధి కోసం ఇప్పటికే సుమారు రెండు లక్షల వరకు ఖర్చు చేసినట్లు మాయకొండ పంచాయతీ అభివృద్ధి అధికారి ఎం సిద్దప్ప తెలిపారు. అయితే ఈ నిధులు సరిపోవని తారు రోడ్డు వేసేందుకు రూ.50 లక్షల నుంచి కోటి వరకు వ్యయం అవుతుందని అన్నారు. ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేను కోరినట్లు చెప్పారు.