కరోనా మహమ్మారి గత సంవత్సరం నుంచి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దాన్ని తరిమికొట్టేందుకు ప్రపంచమంతా ఏకమైనా, రూపాలు మార్చుకుంటూ మానవాళిపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో నాలుగో వేవ్ కూడా నడుస్తోంది. మన దేశంలో సెకండ్ వేవ్ ముగిసిపోయే దశలో ఉండగా మూడో వేవ్ కూడా రానుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే సార్స్ కోవ్- 2 వైరస్ గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) చెబుతోంది. కరోనా వైరస్ సోకిన గర్భిణుల్లో ఇన్ఫెక్షన్ మధ్యస్థం నుంచి తీవ్రస్థాయిలో ఉండే అవకాశం ఉందని సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో తేల్చింది. ఇతరులతో పోలిస్తే వీరికి కోవిడ్ ప్రమాదం ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ స్టడీ వెల్లడించింది.