కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల మూడ్లోకి ఇప్పటి నుంచే షిఫ్ట్ కావాలని ఆదేశించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. వచ్చే ఎన్నికలకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని మంత్రులకు సూచించారు. ఎన్నికల వ్యూహాలపై కేబినెట్ భేటీలో మంత్రులకు జగన్ సంకేతాలిచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఎన్నికల కోసం వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ టీమ్ రంగంలోకి దిగుతుందని జగన్ చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మంత్రులను జగన్ అలర్ట్ చేశారని చెబుతున్నారు. ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఇప్పటి నుంచే ప్రజాప్రతినిధుల క్షేత్రస్థాయిలో పర్యటనలే చేయాలని సంకేతాలిచ్చారు. విపక్షాల ప్రచారానికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటూ మంత్రులకు జగన్ సూచించారు.
రాష్ట్రంలో రోజురోజుకు వైసీపీ సర్కార్ పట్ల వ్యతిరేకత పెరుగుతుండడంతో జగన్తో పాటు ఆపార్టీ నేతలలో కలవరం మొదలయ్యింది. రాష్ట్రంలో వరుసగా మహిళలపై జరుగుతున్న దాడుల విషయాన్ని విపక్షాలు లెవనెత్తడంతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. రోజురోజుకు దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితితో సంక్షేమ పధకాలకు కోత వేస్తుండడం, దీన్ని విపక్షాలు అస్త్రంగా మలచుకుకోవడం వారికి ఇబ్బందిగా మారింది. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలని జగన్ మంత్రులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సీఎం మంత్రులను ఆదేశించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్ర స్ధాయి పర్యటలను చేయాలని కేబినెట్ అనంతరం అర్ధగంటకుపైగా జరిగిన సమావేశంలో మంత్రులకు జగన్ పలు సూచనలు చేశారు.