గ్రామీణులకు రక్షిత జలాలు అందివ్వాలన లక్ష్యంతో చేపట్టిన ఆరోగ్య మురుగు నీటి పథకం పనులు గడువు మీరినా పూర్తి కాలేదు. ఫలితంగా ఏడాది పొడవునా తాగునీటి ఎద్దడితో గ్రామీణులు ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. సకాలంలో పూర్తి చేసి పల్లెల్లో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలు నీటి మీద రాతలయ్యాయి. ప్రజలకు మాత్రం నీటి కష్టాలు మిగిలాయి.
రోళ్ల మడుగు తాగు నీటి పథకం మొదటిదశలో భాగంగా రెండు సుండుపల్లి మండలంలో మొదటి విడతలో 83 పల్లెలకు తాగునీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో 50 కోట్ల రూపాయల అంచనాతో పథకానికి రూపకల్పన చేశారు. 2017 మేలో పనులు ప్రారంభించారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అప్పటి ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడుతూ 2018 వేసవి నాటికి పనులు పూర్తి చేసి దప్పిక కష్టాలు తీరుస్తామని ప్రకటించారు.
బహుదా నదిలో రెండు బావులు , ఒక కలెక్షను భావి, వే బ్రిడ్జి నిర్మాణం మాత్రమే పూర్తి అయింది. విద్యుత్ నియంత్రిక లు లైన్లు ఏర్పాటు చేశారు. సానిపాయీ ఘాట్లో ట్యాంకు, సుండుపల్లి మండలంలోని బోడెప్పాగారి పల్లె వరకు ప్రధాన పైపులైను నిర్మించారు. గ్రామాల్లో ఇప్పటివరకు చేపట్టిన 21ట్యాంకులు నిర్మాణం వివిధ దశల్లో జరిగింది. ఇప్పటివరకు జరిగిన పనులకు 15 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం చెల్లించింది.
ప్రభుత్వాలు మారినా సుండుపల్లి మండల ప్రజల తాగునీటి కష్టాలు మాత్రం తీరడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్థాంతరంగా ఆగిన ట్యాంకుల నిర్మాణం పైపులైన్ల ఏర్పాటు పనులను త్వరితగతిన ప్రారంభించాలి. ఇకనైనా మండల ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వానికి మండల ప్రజలు కోరుకుంటున్నారు.