తూర్పు గోదావరి: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చలానా కుంభకోణం లో ఆలమూరు పోలీసులు అనతికాలంలోనే విచారణ జరిపి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో రామ చంద్రపురం డీఎస్పీ డీ బాల చంద్రారెడ్డి, సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఆలమూరు సబ్ రిజిష్టర్ కార్యాలయం లో చలనా కుంభకోణం జరిగిందనే రిజిష్టర్ ఎ. సునందశ్రీ పిర్యాదు మేరకు మండపేట రూరల్ సీఐ పి. శివ గణేష్, ఎస్ఐ ఎస్. శివ ప్రసాద్ అధ్వర్యంలో త్వరితగతిన విచారణ జరిపి, దుర్వినియోగ మైన రూ. 7, 31, 490 రికవరీ చేశామన్నారు.
ఈ కుంభకోణానికి కారకులైన దస్తావేజు లేఖర్లు దాకమూరి దుర్గా ప్రసాద్, ఏరుబండి శ్రీ రామ చంద్ర మూర్తినీ అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించి నిధులు దుర్వినియోగానికి కారకుడైన అనధికార ఉద్యోగి అత్తిలి నవీన్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించి కుంభకోణానికి సంబందించిన సమాచారం సేకరించామన్నారు. దానికనుగుణంగా అతన్ని అరెస్ట్ చేశామన్నారు. మరొక దస్తావేజు లేఖరి పి. భగవాన్ పరారీలో ఉన్నారని అన్నారు. ఈ కుంభకోణం అంతా సబ్ రిజిష్టర్ కార్యాలయం లో జరిగినందున ఉద్యోగులందరిపై విచారణ జరపాలని జిల్లా ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు.