భర్తతో విడిపోయి ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నచౌక్ పోలీసులు, మృతురాలి సోదరి గోవిందమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
దేవుని కడపకు చెందిన యశోద గత నాలుగేళ్లుగా మాసాపేటకు చెందిన నిత్యపూజయ్య అలియాస్ సురేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. యశోదకు పదేళ్ల క్రితం జయశంకర్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. యశోదకు మరొకరితో వివాహేతర సంబంధం కలిగి ఉందన్న కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి విడిపోయారు. పిల్లలు జయశంకర్ వద్దే ఉంటున్నారు.
ఈ క్రమంలోనే నిత్యపూజయ్య అలియాస్ సురేష్, యశోదలు గత నాలుగేళ్లుగా దేవునికడపలోని ఓ ఇంటిలో సహజీవనం చేస్తున్నారు. గత కొంత కాలంగా తనను పెళ్లి చేసుకోవాలని యశోద నిత్యపూజయ్యను అడుగుతోంది. దీంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ సోమవారం రాత్రి యశోద నిద్రిస్తున్న సమయంలో నిత్యపూజయ్య దిండును ఆమె తలపై పెట్టి ఊపిరాడకుండా చేసి, హత్య చేశాడు. ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయాడు. యశోద ఫోన్ చేయకపోవడం, ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో యశోద చెల్లెలు గోవిందమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లింది. అనుమానం వచ్చి స్థానికుల సహకారంతో తాళం పగులగొట్టించింది. తన అక్క మంచంపై విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేశారు.