ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్ళైన 45 రోజులకే విడాకులు కోరిన భార్య

national |  Suryaa Desk  | Published : Tue, Aug 03, 2021, 04:03 PM

ఆ దంపుతులిద్దరికీ పెద్దలు 45 రోజుల క్రితం అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. కానీ ఆ పెళ్లి యువతికి ఇష్టం లేదు. తల్లిదండ్రులు ఒత్తిడి చేసి మరీ 19 ఏళ్ల వయసులోనే ఆ యువతికి పెళ్లి చేశారు. అయినా సరే.. ఆమెలో బలంగా పాతుకుపోయిన పెద్ద చదువులు చదవాలనే కోరికను చంపుకోలేక పెళ్లి తరువాత చదువుకోవాలనే ఆశతో అత్తమామలను, తల్లిదండ్రులను కోరింది. ఎంత నచ్చజెప్పినా వారు ఒప్పుకోలేదు. చివరికి ఉన్నత చదువులు చదవాలనే కోరికను చంపుకోలేక పెళ్లయిన 45 రోజులకే ఇంటి నుంచి పారిపోయింది. అయితే, ఏమైందో ఏమో తెలీదు కానీ వెంటనే మళ్లీ ఆ యువతి ఊళ్లోకి వచ్చేసింది. ఆ తరువాత విలేజ్‌ కోర్టు ముందుకు వచ్చి విడాకుల కోసం ఆమె చెప్పిన కారణాలు విని అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బీహార్‌లోని జహంగీరా గ్రామానికి చెందిన నేహా కుమారి అనే యువతి 12వ తరగతి వరకు చదువుకుంది. ఆ తరువాత 19 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు ఒత్తిడి చేసి భగల్‌పూర్‌కు చెందిన సునీల్‌ కుమార్‌ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ పెళ్లి జరిగిన 45 రోజుల తరువాత భర్తను వదిలి ఎవరికీ చెప్పకుండా ఆ యువతి ఇంటి నుంచి పారిపోయింది.


దీంతో భర్త తరుపు వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించారు. ఫిర్యాదు చేసే లోపే ఆ యువతి గ్రామానికి మళ్లీ తిరిగొచ్చి విలేజ్‌ కోర్టు ముందు నిలబడింది. అయితే, వచ్చింది భర్తతో కాపురం చేయడానికి కాదు.. విడాకుల కోసం.


తనకు పెద్ద చదువులు చదవాలని ఉందని, పెళ్లికి ముందు తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, పెళ్లయ్యాక అత్తమామలూ ఒప్పుకోలేదని విలేజ్‌ కోర్టు ముందు వాపోయింది. అందుకే ఇంటి నుంచి పారిపోయానని చెప్పిన ఆ యువతి.. తనకు విడాకులు కావాలని కోరింది. అత్తారింట్లో తనకు ఊపిరి ఆపేసినట్లు ఉందంటూ ఏడ్చేసింది. అయితే, యువతితో పాటు ఇరు కుటుంబాలను సర్దిచెప్పేందుకు విలేజ్‌ కోర్టు ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో చివరికి విడాకుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com