ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేడేక్కిన తాడిపత్రి రాజకీయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 03, 2021, 02:34 PM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్‌ కంటిన్యూ అవుతోంది. జేసీ ప్రభాకర్‌ మాటంటే.. కేతిరెడ్డి మాటకు మాటంటున్నారు. మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ పని పెట్టుకుంటే.. ఎమ్మెల్యే హోదాలో కేతిరెడ్డి రివర్స్ గేర్ వేస్తున్నారు. దీంతో.. తాడిపత్రి రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది.


అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. మున్సిపల్ ఛైర్మన్ జేసీ వర్సెస్ అధికారులు రగడ నడుస్తోంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ హోదాలో అధికారులు, సిబ్బందితో తాను సమావేశం ఏర్పాటు చేస్తే గైర్హాజరు కావడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన సిబ్బందితో సమీక్షా సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చారు. కమిషనర్‌తో సహా అందరికీ శనివారమే హుకుం జారీ చేశారు. జేసీ సమీక్ష ఏర్పాటు చేసిన సమయానికే ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా మున్సిపల్‌ సిబ్బందితో కరోనా వైరస్‌ మూడో దశపై అవగాహన ర్యాలీలు, సమీక్ష నిర్వహించారు.


ఎమ్మెల్యే ర్యాలీ, సమీక్ష తర్వాత అధికారులు ఆఫీసుకు వస్తారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్లతో కలిసి కమిషనర్‌ ఛాంబర్‌లో ఎదురు చూశారు. మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యేతో సమీక్ష ముగిసిన తర్వాత అటు నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం కొందరు అధికారులు రాగానే వారి నిబద్ధతను మెచ్చుకుంటున్నట్లు మోకాళ్లపై నిలబడి జేసీ ప్రభాకరరెడ్డి నమస్కారం పెట్టారు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేని స్ధితిలో పడిపోయారు. ఛైర్మన్‌ ఆదేశాలను కాదని సిబ్బంది ఎలా గైర్హాజరవుతారని ప్రశ్నిస్తూ 26మందికి నోటీసులు జారీ చేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. కాగా, మున్సిపల్ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ రెడ్డి మధ్యాహ్నం నుంచి సెలవుపై వెళుతూ ఇతరులకు బాధ్యతలు అప్పగించినట్లు జేసీకి తెలిసింది. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. అధికారులు కార్యాలయానికి వచ్చే వరకు కదిలేది లేదని కార్యాలయంలోనే కూర్చున్నారు. రాత్రంతా మున్సిపల్ కార్యాలయంలో ఉండిపోయారు. భోజనం కూడా అక్కడికే తెప్పించుకుని తినేశారు.


వాస్తవానికి మున్సిపల్ చైర్మన్ హోదాలో పట్టణంలో పరిస్థితులపై జేసీ ప్రభాకర్ అధికారులతో ఓ మీటింగ్ పెట్టుకున్నారు. కానీ అదే సమయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్లకు మరో మీటింగ్‌ పురమాయించి తీసుకెళ్లారు. అది కాస్తా ప్రభాకర్ రెడ్డికి చిర్రెత్తింది. అధికారులు వచ్చి మీటింగ్‌లో పార్టిసిపేట్ చేసే వరకూ తాను ఆఫీస్‌ నుంచి కదలనూ అని భీష్మించారు. నిన్న మధ్యాహ్నం అక్కడికి వెళ్లిన ఆయన రాత్రి వరకూ అక్కడే ఉన్నారు. అయినా అధికారులు రాలేదు. వాళ్లు వచ్చేదాకా అక్కడే ఉంటాను అని చెప్పి ఆఫీస్‌లో తిన్నారు.. అక్కడే పడుకున్నారు. ఇక ఉదయాన్నే నిద్రలేచి యథావిధిగా దినచర్యనూ అదే ఆఫీస్‌లో మొదలు పెట్టేశారు. మున్సిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహంతో ఉన్న జేసీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com