ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు వారాల పాటు నైట్ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఇప్పటికే.. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్పై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. థర్డ్వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను జగన్ ఆదేశించారు.విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించాలనుకున్న పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది ప్రభుత్వం. పోలీస్ బెటాలియన్స్లో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించింది. కమ్యూనిటీ ఆస్పత్రులు స్ధాయివరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. పీహెచ్సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచుతున్నారు. సబ్సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.
ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివిటీ రేట్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు. రోజూవారి నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఇక బుధవారం విడుదలైన ఏపీ కోవిడ్ రిపోర్ట్ ప్రకారం.. కొత్తగా 2107 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,62,049కి చేరింది. ఇందులో 21,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు నిన్న 1,807 వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. రికవరీలు 19,27,438కి చేరాయి.
తూర్పుగోదావరి జిల్లాలో వైరస్…
తూర్పుగోదావరి జిల్లాలో వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్లోకి రాలేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అంబాజీపేట మండలంలో రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుపోతోంది. ఈ నేపధ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంబాజీపేట మండలంలోని మాచవరం, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం, పుల్లేటికుర్రు గ్రామాల్లో వారం రోజుల పాటు కర్ఫ్యూను విధించారు.
ఈ రోజు నుంచి ఈ కర్ఫ్యూ అమలులోకి రానుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతించారు. అవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ కూడా రోడ్లపైకి రావద్దని.. ఒకవేళ వస్తే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అని స్పష్టం చేశారు.