టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఘన విజయాన్ని సాధించాలని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆకాంక్షించారు. రేపటి నుంచి ఒలింపిక్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం ఎదుట 'చీర్ అప్ ఇండియా ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది తనొక్కరి ఆకాంక్ష మాత్రమే కాదని 130 కోట్ల భారత ప్రజల ఆకాంక్ష అని అన్నారు. 18 క్రీడాంశాల్లో 127 మంది బరిలోకి దిగుతున్నారని ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ఇదే అతిపెద్ద బృందమని తెలిపారు. కోచ్లు, సహాయక సిబ్బంది, అధికారులతో కలిపి మొత్తం 228 మంది ఈ ఒలింపిక్స్లో భారతదేశం తరఫున పాల్గొంటున్నారని అన్నారు. ఐదేళ్ల క్రితం భారీ అంచనాలతో రియో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత బృందం కేవలం రెండు పతకాలతో తిరిగి వచ్చిందనీ, ఈ సారి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)ను రూపొందించి ఒలింపిక్స్లో పతకాలు సాధించే సత్తా ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తుందటం, మేటి క్రీడాకారులను మట్టికరిపిస్తూ పతకాలు కొల్లగొడుతుందటంతో టోక్యో ఒలింపిక్స్లో కూడా విజయపరంపర కొనసాగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈసారి ఒలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటుతుందని అందరూ విశ్వసిస్తున్నారని కృష్ణదాస్ చెప్పారు.
కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, కలెక్టర్ శ్రికేశ్ బి. లాటకర్, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్కుమార్, కంబాల జోగులు, బీసీ కార్పొరేషన్ చైర్మెన్లు మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, దుక్క లోకేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీరాముల నాయుడు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, డిఎస్డివో శ్రీనివాస్ కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుందర్ రావు మాస్టర్, సూరి బాబు, కొమర భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.