పెళ్లైన ఏడాదికే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని మైసూరులో జరిగింది. హున్సూర్ తాలూకాకు చెందిన పల్లవి అనే యువతికి ఏడాది క్రితం వివాహమైంది. పెళ్లైన 6 నెలల తర్వాత తన భర్తతో పల్లవికి గొడవలు జరిగాయి. పల్లవి అడిగినవి ఏవీ ఆమె భర్త పట్టించుకోకపోవడంతో.. పల్లవి కూడా భర్తతో అంటీముట్టనట్టుగానే వ్యవహరించింది. కొన్నాళ్లు పుట్టింటికి కూడా వెళ్లిపోయింది. ఇరు కుటుంబాల పెద్దలు భార్యాభర్తలకు నచ్చజెప్పి పల్లవిని తిరిగి కాపురానికి పంపారు.
కొన్ని రోజులు బాగానే ఉన్న ఆ దంపతులు మళ్లీ గొడవపడటం మొదలుపెట్టారు. ఈ గొడవల కారణంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుని గాయపరుచుకునేంత వరకు వెళ్లారు. భర్త తనను వేధిస్తున్నాడని.. పెళ్లయ్యాక జీవితం తాను ఊహించినట్టుగా అసలు లేదని పల్లవి తన సన్నిహితులతో చెబుతుండేది. ఈ క్రమంలో పల్లవికి ఆమె భర్తతో మరోసారి గొడవ జరిగింది. దీంతో భర్త కోపంతో బయటకు వెళ్లిపోయాడు. అతను తిరిగి ఇంటికొచ్చేసరికి పల్లవి ఉరికి వేలాడుతూ కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న జయలక్ష్మీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పల్లవి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పల్లవి కుటుంబ సభ్యుల మేరకు ఆమె భర్తపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.