కట్టుకున్న భర్త రాక్షసత్వాన్ని భరించలేక అతడికి దూరంగా ఉంటున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడో కసాయి భర్త. గుజరాత్ లో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెవ్వాడ ఏరియాలో నివసించే పునీత్ మిట్టానీ ఫన్సాసా గ్రామంలోనే ఉంటున్న మమతా మిట్టానీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో అమ్మాయి కుటుంబసభ్యులు భారీగా కట్నకానుకలు సమర్పించి ఘనంగా వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంత కాలం బాగానే ఉన్న పునీత్ వ్యవహార శైలి అ తర్వాత మారిపోయింది. ప్రతిదానికి చిరాకు పడుతూ మమతపై చేయిచేసుకోవడం, ఎప్పుడూ కోపంగా ఉండటంతో ఆమె విసుగెత్తిపోయింది.
అతడి కృూరత్వం మరీ ఎక్కువ కావడంతో తన పిల్లలను తీసుకుని తండ్రి ఇంటికి వచ్చేసింది. ఐదేళ్లుగా తండ్రివద్దే ఉంటోంది. అయితే తన పిల్లలను తనకు ఇచ్చేయాలని మమతను ఇటీవల పునీత్ ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. తనకు విడాకులు ఇవ్వడంతో పాటు తన పిల్లలను తన వద్దే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించుకుంది. మమత లీగల్ గా వెళ్తుండటంతో ఆమెపై కక్ష్య పెంచుకున్నాడు పునీత్. ఇలా చేయడం ద్వారా పిల్లల్ని శాశ్వతంగా తనకు దూరం చెయ్యాలని చూస్తోందని పగ పెంచుకున్నాడు. వెంటనే ఆమె పుట్టింటికి వెళ్లి కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు. దీంతో కింద పడిపోయింది మమత. ఆమె చనిపోయిందని భావించిన పునీత్ అక్కడి నుండి పరారైపోయాడు.
అయితే ఆమె అప్పటికి చనిపోలేదు. అతడు వెళ్లిన కొద్ది సేపటికి స్పృహలోకి వచ్చిన మమత ఓపిక తెచ్చుకుని సెల్ ఫోన్ లో వీడియో తీసింది. తనను హత్య చేయాలనుకున్న భర్త బాగోతాన్ని వివరించింది. పొరుగూరు వెళ్లిన తండ్రి తిరిగి వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న కూతురును చూసి షాక్ తిన్నాడు. వెంటే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. పునీతే ఈ దారుణానికి పాల్పడ్డాడని మృతురాలు వీడియోలో చెప్పడంతో అతడిని పట్టుకోవాలని మమత బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికైనా పిల్లలను కూడా పొట్టన పెట్టుకుంటాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్లాన్ ప్రకారం సిద్దంగా ఉన్న పునీత్ సెల్ ఫోన్ వాడకుండా ఎక్కడికో పరారయ్యాడు. అతడు ఎక్కడ ఉన్నా పట్టుకుని శిక్షిస్తామని అంటున్నారు పోలీసులు.