భారత క్రికెట్ కు సౌరవ్ గంగూలీ ఒకప్పుడు ఆటగాడిగా, కెప్టెన్ గా ఎన్నో విజయాలందించాడు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాడు. దాదా నేడు 49వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా గంగూలీ గురించి పలు ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.
ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 9వ ఆటగాడు సౌరవ్ గంగూలీ. ఇండియన్ క్రికెటర్లలో మూడో వ్యక్తి. మొత్తంగా 11,363 పరుగులు చేశాడు. గంగూలీ కంటే సచిన్, విరాట్ ముందున్నారు.
నిజానికి గంగూలీది కుడిచేతి వాటం. రాయడం, బౌలింగ్ చేయడం కుడిచేత్తోనే. అతడి సోదరుడు స్నేహాశీష్ ఎడమ చేతి వాటం ఆటగాడు. అతడి కిట్ ను ఉపయోగిస్తూ అదే శైలి అలవాటు చేసుకున్నాడు.
వన్డేల్లో వరుసగా 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు అందుకున్న ఏకైక ఆటగాడు గంగూలీ. 1997, సెప్టెంబర్ 14-21 మధ్యన పాకిస్థాన్ తో జరిగిన మ్యాచు ల్లో అందుకున్నాడు.
గంగూలీ సెంచరీ కొట్టిన ఏ టెస్టు మ్యాచులోనూ భారత జట్టు ఓడిపోలేదు. 12 మ్యాచులు డ్రా అవ్వగా 4 మ్యాచుల్లో విజేతగా ఆవిర్భవించింది.
టీం నుంచి తొలగించినప్పటికీ టెస్టుల్లో గంగూలీ సగటు ఎప్పటికీ 40 కిందకు పడిపోలేదు. కెరీర్లో 42.17 సగటుతో అతడు 7,212 పరుగులు చేశాడు.
భారత జట్టు కెప్టెన్గా గంగూలీ అత్యుత్తమ బౌలింగ్ గణాకాలు నమోదు చేశాడు. 2000, డిసెంబర్ 11న కాన్పూర్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచులో 10-1-32-5 గణాంకాలు నమోదు చేశాడు.
వన్డేల్లో 10 వేల పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచులు అందుకున్న ఆరుగురు క్రికెటర్లలో గంగూలీ ఒకరు.
ఇంటర్నేషనల్ క్రికెట్ లో అరంగేట్రంలో (ఇంగ్లాండ్పై) సెంచరీ చేసి ఆఖరి టెస్టు ఇన్నింగ్స్లో తొలి బంతికే (ఆస్ట్రేలియాపై) ఔటైన ఒకే ఒక్క ఆటగాడు గంగూలీ.
బీసీసీఐ అధ్యక్షుడైన రెండో క్రికెటర్ గంగూలీ. 1954లో విజయనగరం మహారాజు(పూసపాటి విజయ ఆనంద గజపతి రాజు)ఆ పదవిని అలంకరించారు. సునిల్ గావస్కర్, శివలాల్ యాదవ్ తాత్కాలిక అధ్యక్షులుగా సేవలందించారు.
విదేశాల్లో అత్యంత విజయవంతమైన టీమిండియా కెప్టెన్ గంగూలీ. 28 మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించగా 11 మ్యాచుల్లో విజయాన్నందించాడు.