తాత్కాలిక సుఖాలు కొన్నిసార్లు బంధాలను చిదిమేస్తుంటాయి. ఈ విషయంలో కట్టుకున్న భార్య, భర్త, పిల్లలు, కన్నతల్లిదండ్రులు అనే బంధాలుండవు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే హత్య చేయించిందో మహిళ. చివరకు అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని సుబ్బారావుపేటకు చెందిన ప్రసాద్ కు కొన్నేళ్ల క్రితం అంబిక అనే మహిళతో వివాహమైంది. కానీ అంబికకు లింగంపేటకు చెందిన చక్రిదొర అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. ఐతే ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన అంబిక అతడ్ని ఎలాగైనా చంపేయాలని స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ప్రసాద్ తోడల్లుడైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అంబిక సంప్రదించింది. శ్రీకాంత్ కు ప్రసాద్ కు గతంలోనే గొడవలుండటంతో హత్యకు అతడు కూడా అంగీకరించాడు. జూన్ 30న శ్రీకాంత్.. ప్రసాద్ ను తీసుకొని మారేడుమిల్లి వెళ్లాడు. అక్కడ ప్రసాద్ కు మద్యం తాగించిన శ్రీకాంత్ బండరాయితో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని భార్య అంబిక పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తమదైన శైలిలో విచారించగా ప్రియుడి కోసం తానే హత్య చేయించినట్లు అంగీకరించింది.