ఓ యువతి మాటలు నమ్మి ఆమె ఇంటికి వెళ్లిన యోగా ట్రైనర్ పై దాడి జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పెనమలూరులో కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడికి చెందిన కడలి వెంకటేశ్వరరావు నగరంలోని అయ్యప్పనగర్ లో నివాసముంటున్నాడు. యోగా శిక్షకుడిగా పని చేస్తున్న ఇతడికి గత నెల 28న ఓ యువతి ఫోన్ చేసింది. తన పేరు కరిష్మా అని తన తండ్రికి యోగా నేర్పాలని కోరింది. 30వ తేదీన మరో సారి ఫోన్ చేసిన ఆ యువతి.. ఓ సారి తన ఇంటిని చూసి వెళ్లాలని కోరింది. తాడిగడప డొంకరోడ్డులోని ఓ అపార్ట్ మెంట్ చిరునామా అని చెప్పింది. అక్కడికి వెళ్లిన వెంకటేశ్వరరావకు కరిష్మా.. ఓ వ్యక్తిన తన బాబాయిగా పరిచయం చేసింది. అపార్ట్ మెంట్ రెండో అంతస్తులో ఉంటున్నామని మరుసటి రోజు ఉదయం 4 గంటలకు వచ్చి యోగా నేర్పించాలని వివరించింది.
యువతి చెప్పినట్లుగా మరుసటి రోజు అక్కడికి వెళ్లిన వెంకటేశ్వరరావుపై నలుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడి నుండి తప్పించుకుని పారిపోయిన ఆ యోగా ట్రైనర్ తెల్లవారిన తర్వాత అపార్ట్ మెంట్ వద్దకు వెళ్లాడు. కరిష్మకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఆ యువతి కోసం అపార్ట్ మెంట్ లో విచారించగా ఆమె ఎవరో తమకు తెలియదని అక్కడి వారు సమాదానం ఇచ్చారు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇది వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో జరిగిందా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.