మీలాంటి చిన్న గ్రూపులు ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో పోయాయి అంటూ ప్రస్తుతం బ్రిటన్లో సమావేశమైన జీ7 దేశాలపై చైనా తన అక్కసును వెల్లగక్కింది. దేశాలు చిన్నవైనా, పెద్దవైనా.. బలమైనవైనా, బలహీనమైనవైనా.. పేదవైనా, ధనిక దేశాలైనా అన్నీ సమానమే అని మేము ఎప్పుడూ విశ్వసిస్తాం. అన్ని దేశాల సంప్రదింపులతోనే ప్రపంచ వ్యవహారాలను నిర్వహించాలి అని లండన్లోని చైనీస్ ఎంబసీ అధికార ప్రతినిధి అన్నారు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ప్రపంచంలో అగ్రదేశం అమెరికాకు సవాలు విసిరే స్థాయికి ఎదిగింది చైనా. ఇప్పుడు ప్రపంచంలోని అగ్రదేశాలన్నింటి లక్ష్యం ఒక్కటే. అది చైనాకు చెక్ పెట్టడం.
ఇప్పుడు బ్రిటన్లో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు కూడా చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికలపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా ఇలా ఘాటుగా స్పందించింది. చైనాకు తాము ప్రత్యామ్నాయ శక్తిగా నిలవగలమని జీ7లో భాగమైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే ధనికవంతమైన ప్రజాస్వామ్య దేశాలు. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఏకీకృత విధానంతో ముందుకు రావాలని చైనాపై చర్చ సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇతర దేశాలకు సూచించారు. చైనా చేపట్టిన వేల కోట్ల విలువైన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందిన దేశాలు మరో బలమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ను తెరపైకి తీసుకురావాలని జీ7 భావిస్తోంది.