పాకిస్థాన్ స్నేహపూర్వకంగా పంపిన మామిడి పండ్లను అమెరికా, చైనా తదితర దేశాలు తిరస్కరించాయి. కరోనా వైరస్ క్వారంటైన్ నిబంధనలను చూపుతూ ఈ పండ్లను స్వీకరించేందుకు అంగీకరించలేదు. ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్థాన్ బుధవారం 32 దేశాలకు మామిడి పండ్లను బహుమతిగా పంపించింది. వీటిని తిరస్కరించిన దేశాల్లో అమెరికా, చైనా, కెనడా, నేపాల్, ఈజిప్ట్, శ్రీలంక కూడా ఉన్నాయి. తాము వీటిని స్వీకరించలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ అరిఫ్ అల్వీ తరపున ఈ మామిడి పండ్లను పంపించారు. 2015లో అప్పటి పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఇదే విధంగా మామిడి పండ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీలకు స్నేహపూర్వకంగా పంపించిన సంగతి తెలిసిందే.