గుంటూరు జిల్లాలో సముద్రతీర ప్రాంతం పేకాట కేంద్రాలకు అడ్డాగా మారింది. రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాలు పేకాట రాయుళ్లతో కళకళలాడుతున్నాయి. ఓ వైపు నిజాంపట్నం ప్రాంతంలోని రొయ్యల చెరువుల్లోని మైదాన ప్రాంతాల్లో కొన్ని శిబిరాలు నడుస్తున్నాయి. మరోవైపు బాపట్ల సముద్ర తీరంలోని రిసార్ట్స్ పేకాట క్లబ్బులుగా మారాయి. అధికారపార్టీ ఎంపీ కనుసన్నల్లో నడిచే ఈ శిబిరాలకు బడాబాబులు సుధీర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు.
రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లో పేకాట శిబిరాలను కొనసాగిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్టణం మండలంలోని మైదానం ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లలో పేకాట, మూడుముక్కలాటలు జోరుగా సాగుతున్నాయి. కరోనా లాక్ డౌన్, కర్ఫ్యూ పరిస్థితుల్లోనూ నిజాంపట్టణంలో ప్రత్యేకంగా గుడారాలు వేసి, ఏసీలు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలతో పేకాట రాయుళ్లను ఆకర్షిస్తున్నారు. మరోవైపు బాపట్ల సముద్రతీరప్రాంతంలోని రిసార్ట్స్ను పేకాట క్లబ్బులుగా మార్చారు. ఈ పేకాట శిబిరాలు రాత్రింబవళ్లు నిర్విరామంగా నడుస్తున్నా పోలీసులు కన్నెత్తికూడా చూడని పరిస్థితి. ఎవరి స్థాయిలో వారికి పోలీసులకు నెల మామూళ్లు పేకాట నిర్వాహకుల నుంచి అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో పేకాట శిబిరాలను పోలీసులు పట్టించుకోవడంలేదు.