కరోనా విజృంభిస్తున్న వేళ.. అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు.. ఇప్పుడు ఎవరి నోట చూసినా ఇదే మాట.. కృష్ణపట్నం నెల్లూరు జిల్లాలోని ఓ తీర ప్రాంతంలోని ఊరు ఇప్పుడు ఆనందయ్య మందు కారణంగా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆంధ్రాలోనే కాదు.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా కరోనా రోగులు కృష్ణపట్నం వచ్చారు. ఆయన ఇస్తున్న ఆయుర్వేద మందు బాగా పని చేస్తుందన్న పేరూ వచ్చింది.
అయితే జనం అనూహ్యంగా పెరగడం.. మందుపై విమర్శలు రావడంతో.. ప్రస్తుతానికి పంపిణీ నిలిపేశారు. ఆనందయ్య మందును ఆయుర్వేద నిపుణులు, ఐసీఎంఆర్ ప్రతినిధులు పరిశీలించారు. నమూనాలు పరీక్షల కోసం తీసుకెళ్లారు. వారు త్వరలోనే తమ నిర్ణయం చెప్పే అవకాశం ఉంది. అయితే.. ఈ ఆనందయ్యకు అండగా నిలవాలని టీటీడీ భావిస్తోంది. కరోనాకు విరుగుడుగా దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతున్న కృష్ణపట్నం ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద వైద్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది.
ఒకవేళ కేంద్ర ఆరోగ్యశాఖ బృందాల నుంచి ఆనందయ్య ఔషధానికి అనుమతులు లభిస్తే... భారీగా మందును ఉత్పత్తి చేసేందుకు సహకరించాలని నిర్ణయించింది. టీటీడీకి రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఆయుర్వేద ఆసుపత్రి, వైద్యకళాశాల, సొంత ఫార్మసీ ఉన్నాయి. ఇప్పటికే టీటీడీ పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రికి చెందిన ఓ బృందంతో కలిసి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పర్యటించారు. ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసిన ఆనందయ్యను కలిసిన చెవిరెడ్డి...ఆ ఔషధాన్ని తయారు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
ఆనందయ్య ఔషధం తయారీ విధానం.. వినియోగించిన వన మూలికలు.. మందు ఏ విధంగా పనిచేస్తుంది.. అనే అంశాలపై ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి బృందం ఆరా తీసింది. నమూనాలను సేకరించిన అనంతరం ఆనందయ్య కుటుంబ సభ్యులతో చర్చించింది. మందు పనితీరు గురించి గ్రామ ప్రజలనూ అడిగి తెలుసుకుంది. ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనాను ఆయుర్వేద మందు నయం చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్న వేళ....ఔషధం పనితీరుపై యుద్ద ప్రాతిపదికన అధ్యయనం సాగించాల్సిన అవసరం ఉందని చెవిరెడ్డి అన్నారు. ఆయుర్వేద మందు నిజంగా ఆమోదయోగ్యమైతే భవిష్యత్తులో ప్రజలకు అందించేందుకు టీటీడీ ఆయుర్వేదిక్ ఫార్మసీ ద్వారా అందుబాటులోకి తెస్తామన్నారు.