రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. పూర్తి లాక్డౌన్ విధించినా వైరస్ ప్రతాపం చూపుతూనే ఉంది. రోజుకు సగటున 30 వేల మంది కరోనా బారినపడుతున్నారు. ఇప్పటి వరకు 14,63,364 మంది కరోనా వైరస్కు గురికాగా, ప్రస్తుతం 1.85 లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని పడకలు చాలక ప్రాంగణాలు, అంబులెన్స్లలో ఉండి చికిత్స పొందాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కల్యాణ మండపాలు, కాలేజీలు, పాఠశాలలను ఆక్సిజన్ వసతితో కూడిన పడకల ఆస్పత్రులుగా మారుస్తోంది. వ్యాక్సినేషన్ కూడా జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేత గా ఉన్న స్టాలిన్ కరోనా కట్టడికి అనేక సూచనలు చేశారు. అసెంబ్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం వాటిల్లో ఒకటి.
ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ గురువారం అసెంబ్లీ స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కరోనా నియంత్రణ చర్యలపై నేతల అభిప్రాయాలు సేకరించారు. డీఎంకే తరఫున టీఆర్ బాలు, ఆర్ఎస్ భారతి, అన్నాడీఎంకే నుంచి జయకుమార్, పరమశివం, కాంగ్రెస్ నుంచి విజయధరణి, మునిరత్నం, బీజేపీ నుంచి నయనార్ నాగేంద్రన్, పీఎంకే, ఎండీఎంకే వీసీకే, సీపీఎం, ఎంఎంకే, కేఎండీకే, టీవీకే తదితర 13 పారీ్టల నేతలు హాజరయ్యా రు. చెన్నైలోని సచివాలయంలో గురువారం సాయంత్రం 5.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. లాక్డౌన్ సమర్థవంతంగా అమలవుతోందా, 24వ తేదీ తర్వాత ఎత్తివేయడమా, కొనసాగించడమా అనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ రెమ్డెసివర్ మందు డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని చెన్నైతోపాటు ఇతర నగరాల్లో అమ్మకాలు సాగిస్తున్నామని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో పారదర్శకతను పాటిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా సహాయక చర్యల నిమిత్తం 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమును ప్రారంభించామని, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి ఆక్సిజన్ దిగుమతి కోసం కేంద్రంపై చేసిన ఒత్తిడి సత్పఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. సింగపూరు, థాయ్లాండ్ దేశాల నుంచి ఆక్సిజన్ కంటైనర్లను రప్పిస్తున్నట్టు వివరించారు. పాజిటివ్ కేసుల పెరుగుదల వల్ల ఆక్సిజన్ పడకలు పెంచుతున్నామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటికే ప్రకటించామని స్టాలిన్ వివరించారు.