పవిత్రమైన రంజాన్ పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘ అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలి. కరోనా మహమ్మారి నుంచి బయట పడి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలి. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్ఠగా అల్లాహ్ను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారు. అల్లాహ్ రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ.. బీద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు’’ అని పేర్కొన్నారు.