శ్రీకాకుళం జిల్లాలో రోజుకు 10 వేల కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ కేసులు, పరీక్షలపై సంబంధిత అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ టేలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో కోవిడ్ కేసులు త్వరితగతిన గుర్తించాలని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు నమూనాలు ఎక్కువగా సేకరించాలని ఆయన ఆదేశించారు. కేసులు త్వరితగతిన గుర్తించడం వలన నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. నమూనాలు సేకరణ, కంటైన్మెంట్ జోన్లపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఎక్కువ కేసులు నమోదు అవుతున్న శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, మెలియాపుట్టి, పలాస, ఇచ్చాపురం, ఎచ్చెర్ల, రణస్థలం, రాజాం, పాలకొండ, సోంపేట, పాతపట్నం తదితర ప్రాంతాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో కనీసం 250 నమూనాలు సేకరించాలని ఆయన స్పష్టం చేసారు. సేకరించిన నమూనాలు తక్షణం లాబ్ కు పంపించాలని, ఫలితాలు త్వరగా అందించాలని ఆయన ఆదేశించారు. కూడళ్లలో ఎక్కువ రద్దీ ఉంటుందని అటువంటి కూడళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. వైరస్ వ్యాప్తికి కూడళ్లు కొంత ఎక్కువ కారణం కావచ్చని
ఆయన అభిప్రాయపడ్డారు. మత్స్యకార గ్రామాల్లో గుమిగూడి ఉంటారని అటువంటి గ్రామాలను పరిశీలించి అవగాహన క్షల్పించాలని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే దుకాణాలు, ఇతర యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
హోమ్ ఐసోలేషన్ కిట్లు అందాలి :
హోమ్ ఐసోలేషన్ కిట్లు విధిగా అందాలని కలెక్టర్ నివాస్ స్పష్టం చేసారు. కిట్లు పంపిణీని పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా అవసరమగు కిట్ల నివేదికను అందించాలని ఐసిడిఎస్ పిడి ని ఆదేశించారు.
ఈ టేలి కాన్ఫెరెన్సు లో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, నోడల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.